ఉద్దేశ్యం

ఈ బ్లాగు యొక్క ఉద్దేశ్యం విషవృక్షం పుస్తకాన్ని సమీక్షించి ఆ పుస్తకం రచయిత్రి రామాయణం గురించి చేసిన కువిమర్శలు/విషప్రచారాలను బయట పెట్టడం. ఇందులో రచయిత్రి వ్యక్తిగత విషయాలు గానీ, అసభ్య పదజాలం గాని ఉండదు. ఒక వేళ ఎవరి వ్యక్తిగత విషయాలైనా చర్చకువస్తే అది ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయడానికే తప్ప అవమానించడానికి మాత్రం కాదు. గమనించగలరు!

Wednesday 20 June 2012

రంగనాయకమ్మ పైశాచిక ఆనందం..

కొన్ని నవ్వించే విషయాలు అనే శీర్షిక క్రింద రంగనాయకమ్మ రాసిన విషయాలు చూద్దాం..


దశరథుడు కైక కోరిన వరాలకు అదిరిపడి "భర్త ముద్దుగా వరాలు కోరుకోమంటే మాత్రం చక్కగా భర్తకు సంతోషం కలిగించే వరాలు కోరుకోవాలి గానీ భర్తకు నష్టం కలిగించే వరాలు కోరుకోవచ్చునా?" అని విసుక్కున్నాడు. చక్కగా భార్యలు చీరలో, నగలో కోరుకుంటే దశరథ మహారాజు గారు వాటిని తక్షణం తెప్పించి ఇచ్చి తమ కీర్తికాంతులు నలుదిశలా వెదజల్లేవారే, అంత కీర్తి తప్పిపోయినందుకు మహరాజు భార్య మీద మండిపడ్డాడు "దుష్టురాలా! నీ వరాల్ల నేను రాముణ్ణి అడవికి పంపితే ఆ దు:ఖంతో నేను చచ్చిపోతాను. నా కోసం రాముడు చచ్చిపోతాడు, లక్ష్మణుడు చచ్చిపోతాడు. భరతుడు చచ్చిపోతాడు. శతృఘ్నుడు చచ్చిపోతాడు రాణులందరూ చచ్చిపోతారు" అంటూ తనతోపాటూ చచ్చిపోయే వాళ్ళ పట్టీ చదువుతాడు. కానీ తమాషా ఏమంటే దశరథుడు చచ్చిపొయిన తర్వాత ఒక్కరన్నా చచ్చిపోలేదు. పైగా అయోధ్యలో సందడి ఇంకా ఎక్కువ అయ్యింది. "ముసలి రాజు పోయాడు పెద్ద కొడుకు అడవుల్లో ఉన్నాడు. భరతుడింకా రాలేదు. ఇప్పుడేం జరుగుతుందో" అనే ఉత్సాహంతో జనం ఎక్కడికక్కడ కబుర్లలో మునిగి ఉన్నారు.
తమపిల్లలు తమని ప్రేమిస్తారని ప్రతీ తండ్రీ అనుకుంటాడు. దశరథ మహారాజు కూడా అలానే అనుకున్నాడు.  అందుకు ఆయన మీద జోకులు!! ఏం చేస్తాం మన ప్రారబ్దం!! పైన వాక్యం లో కవి దశరథుడికి తన కుమారులతో  ఉన్న అనుబంధాన్ని వివరించడం సుస్పష్టం. దానిలోని ఒక వాక్యాన్ని బయటకు తీసి రంగనాయకమ్మ తమాషా అనడం అమె పైశాచిక ప్రవృత్తికి నిదర్శనం. తండ్రిలేని జీవితం మనిషికి అంధకారం లాంటిదని పెద్దలు చెబుతారు. అంటే దాని అర్థం ప్రపంచంలోని తండ్రులందరూ తలపైన దీపాలు పెట్టుకుని తిరుగుతున్నారని కాదు.  ఇక జనం ఉత్సాహంతో ఎక్కడికక్కడ కబుర్లలో మునిగి ఉన్నారు అని చెప్పడం సత్యదూరం. భరతుడు రాజ్యంలోకి వచ్చేదారిలో దు:ఖమయమైన నగరాన్ని చూసి ఆందోళన చెందాడని వాల్మీకి మహర్షి రాశారు. తనకు అనుకూలంగా లేదని కాబోలు రంగనాయకమ్మ ఆ ఊసే ఎత్తలేదు. అనుబంధాలని పరిహసించే రంగనాయకమ్మ స్త్రీల గురించి అమ్మల గురించి పుంఖానుపుంఖాలుగా రాయడం తెలుగు జాతికి పట్టిన దౌర్భాగ్యం. 


మరొకటి..
తనను, సారథిని, గుఱ్ఱాలనూ రక్షిస్తూ 11వేలమంది శతృవీరుల్తో వొక్కసారిగా యుద్ధంచేసి జయిస్తాడని రుషులు రాముడిని పొగుడుతారు. అలాంటి రాముడు గంగదాటి అడవిలోకాలు మోపగానే "లక్ష్మణా! నువ్వు రాకపోతే సీతని రక్షించడం చాలా కష్టమైపొయేది. మీరిద్దరూ ముందు నడవండి. నేను వెనుక నడుస్తాను. మిమ్మల్ని వెనుక నుంచీ రక్షిస్తాను" అంటాడు. అడవుల్లో రక్షించవలసినవాళ్ళు వెనుక నడవాలా, ముందు నడవాలా?? 
అడవిలో ముందు నుంచీ మాత్రమే ప్రమాదాలొస్తాయనే రంగనాయకమ్మ తెలివికి లాల్ సలాం! అసలు ఇలాంటి తింగర లాజిక్కులు ఇంకెవరూ చెప్పలేరేమో.. ఒకసారి రంగనాయకమ్మ చేత ఏ తలకోన అడవిలోనో పాదయాత్ర చేయిస్తే అప్పుడు తెలుస్తుంది ప్రమాదాలు ఏ వైపు నుంచీ వస్తాయో. ముందు టపాలో చెప్పినట్టు ఎలాగైన రాముణ్ణి కించపరచాలనే ఆకాంక్ష రంగనాయకమ్మలో బలంగా ఉంది. అందుకే ఇంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా అర్థం పర్థం లేని వాదనలు చేయగలిగింది.


ఇంకొకటి..
రాముడు, సీతా, లక్ష్మణుడూ వనవాసంలో అత్రి మహాముని ఆశ్రమానికి వెళతారు. అత్రి భార్య అనసూయ మహ పతీవ్రత. వృద్ధురాలు. నెరసిన జుట్టు వొణికే శరీరం. ఆమె సీతకు పూలదండా, అంగరాగాలు ఇస్తుంది. "నా దగ్గర తపస్సు చాలా మిగిలి ఉంది. నా తపోశక్తితో నీకి బహుమానాలిస్తున్నాను. నిత్యం ఈ పూలదండ ధరిస్తే నువ్వు నిత్య యవ్వనవతిగా ఉంటావు. ఈ అంగరాగాలతో నీ సౌందర్యం ఇనుమడిస్తుంది. ఇవి ధరిస్తే యవ్వనంతో నీ భర్తకి సంతోషం కలిగిస్తావు" అంటుంది. మరి తన మాట??తనెందుకు వాటిని ధరించి నిత్యయవ్వనవతిగా ఉండలేదు?అత్రి మహాముని గారికి ఆ ముగ్గుబుట్ట తలే ఇష్టం కావున్ను!!
తన తపోశక్తితో అనసూయ సీతకు బహుమతి ఇస్తే మధ్య రంగనాయకమ్మకు బాధ ఎందుకో?? అలాంటి బహుమతులు తనకు ఎవరూ ఇవ్వలేదనా?? లేక ఎలాగైన విమర్శించాలనే తపనా? మరొక విషయం- మనశక్తిని వేరేవాళ్ళకోసం ఉపయోగించడం మనకు వాళ్ళ మీద ఉన్న అనురాగాన్ని ఆప్యాయతని చెబుతుంది. ప్రతీ ఒక్కటి తనకు మాత్రమే కావాలనుకునే స్వార్థపు ఆలోచనలు అనసూయకు లేకపోవడం రంగనాయకమ్మకు కోపం తెప్పించాయి కాబోలు. ప్రపంచంలో అందరూ తనకు నచ్చినట్టే ఉండాలనుకునే వ్యక్తికి నిస్వార్థమైన ఆలోచనలు తమాషా అవడం అతి సహజం.
ఇవన్నీ పక్కన పెడితే ముగ్గుబుట్ట తల అని ముసలివాళ్ళను కించపరచడం రంగనాయకమ్మ కండకావరాన్ని సూచిస్తుంది. వార్థక్యం అనేది ప్రతీ మనిషికి సహజమైన దశ. దాని గురించి ఇంత నీచంగా మాట్లాడటం వ్యక్తిలోని పైశాచిక ప్రవృత్తిని బయటపెడుతుంది. మరి రంగనాయకమ్మకు రాలేదా ముసలితనం?? ఇలాంటి వ్యక్తిని ప్రజలు స్త్రీవాదిని అని, మరొకటని పొగుడుతుంటే వాళ్ళ అజ్ఞానానికి జాలిపడటం తప్ప ఇంకేమీ చెయ్యలేను.. 





సర్వేజనా సుఖినోభంతు
-రామదండు.




Wednesday 6 June 2012

పీఠికలోనే మొదలైన పీడ: వంకర లాజిక్కులు

రుషులపైన అక్కసు:
పదేళ్ళు వర్షాలు లేవు లోకమంతా దగ్ధమవుతూ ఉంది. అనసూయ తన పాతివ్రత్యం తో రుషులకోసం చెట్లకి పళ్ళు, గంగలో నీళ్ళూ సృష్టించింది. ఇదీ కథ! దీని మీద కూడా మనలోకజ్ఞానం ప్రశ్నల వర్షం కురిపిస్తుంది- " ఏ మనిషికైనా పళ్ళూ, నీళ్ళూ సృష్టించడం  సాధ్యమౌతుందా?? అంత సృష్టించగలిగేప్పుడు పళ్ళని చెట్లకే సృష్టించడం ఎందుకూ? చెట్లెక్కే శ్రమ మాత్రం ఎందుకు?? పళ్ళని చేతుల్లోనే సృష్టించరాదూ??" ఇలా ఎంతైనా తర్కించవచ్చు. కానీ, మన ప్రశ్నలు ఇంతటితో ఆగిపోతే ఈ కథనుంచీ మనం తెలుసుకోగలిగేది ఏమీ ఉండదు. ఈ కథలో కొన్ని సాంఘిక విషయాలు ఉన్నాయి. అవేమంటే స్త్రీలు పూర్తిగా పాతివ్రత్యాన్ని ఆమోదించారు. అది సమాజం లో గౌరవప్రదం అయిపోయింది. అంతే కాదు, ఆ పతీవ్రత పళ్ళూ, నీళ్ళూ సృష్టించింది ఎవరికోసం? రుషుల కోసం! రుషులకోసం మాత్రమే ఎందుకు సృష్టించాలి? లోకాలన్నీ దగ్ధమౌతున్నప్పుడు ప్రజలందరూ కష్టాలు పడుతుండరా? అందర్నీ రక్షించాలి కదా?? "సమస్త జనుల కోసం సృష్టించింది" అని ఎందుకు చెప్పలేదు. ఎందుకంటే చెప్పేవారికి సమస్త జనుల శ్రేయస్సు  అవసరం లేదు గనక, రుషుల రక్షణ ఒక్కటే వారి ధర్మం గనక! ఎవరికి శక్తిసామర్థ్యాలున్నా, ఎక్కడ సిరిసంపదలున్నా అవి రుషుల శ్రేయస్సుకే ఉపయోగ పడాలి ఎందుచేత ఇతర ప్రజల సంగతేమిటి??

చెట్లెక్కే శ్రమ ఎందుకూ అని రంగనాయకమ్మ కు అనిపించి ఉండచ్చు. కానీ అప్పటి ప్రజలు రంగనాయకమ్మ అంత సోమరులు కాదని  వాల్మీకి మహర్షికి తెలుసు కాబోలు అందుకే అలా రాశాడు.ఇక రుషుల మీద అక్కసు మిగిలిన పేరాలో  ఎత్తికొట్టినట్టు కనిపిస్తుంది. ఆ పళ్ళూ, నీళ్ళు అనసూయ సృష్టించింది రుషులకు మాత్రమే అని ఎక్కడ చెప్పారు?? అవి రుషులకోసం అంటే మిగిలినవారికి కాదు అనుకోవడం ఒక ఊహ తప్ప నిజం కాదు. ఇది పక్కన పెడితే, ఎవరికోసం చెయ్యాలో అనసూయకు రంగనాయకమ్మ చెప్పడం ఏమిటి ? ఆమె పాతివ్రత్య బలం తో ఆమెకు ఇష్టమైనవాళ్ళకు మేలు చేస్తుంది. ప్రజలందరికీ మేళ్ళు చేయడానికి అనసూయ పబ్లిక్ సర్వెంట్ కాదు, బాండేడ్ లేబర్ అంతకు ముందే కాదు. ఇంకా నయం , అనసూయ తన పాతివ్రత్య బలం తో మార్కిస్టులకు సకల సదుపాయాలు ఇవ్వాలని వాదించలేదు. ఇలాంటి అర్థం లేని వాదనలు ఈ పుస్తకం లో చాలానే ఉన్నట్టున్నాయి. రాజు పెద్దభార్య సామెత లాగా మాటిమాటికి సాధారణ ప్రజల ప్రస్తావన తెచ్చి వాళ్ళను విక్టిమైజ్ చెయ్యాలని చూడటం ఈ పుస్తకం లో తరచుగా కనిపిస్తుంది. ఎందుకంటే, సాధారణ ప్రజల గురించి వకాల్తా పుచ్చుకున్నట్టు ఎంత ఎక్కువ ఫోజు కొడితే అంత ఎక్కువ మార్కెట్ పెరుగుతుంది. ఈ పుస్తకం రాసినప్పుడు మన రాష్ట్రంలో కమ్యూనిస్టులు చెప్పుకోదగ్గ సంఖ్య లో ఉండేవాళ్ళు ఇలాంటివి రాయకపోతే వాళ్ళెవరూ ఈ పుస్తకాన్ని కొనరు. మార్కెట్ ప్రకారం రచనలు చెయ్యకపోతే కమర్షియల్ రచయితలకు విలువలేదు.

ఇక రాజులవంతు:
రాముడి పట్టాభిషేకం వార్త తెలియగానే కైక ఉదాసీనంగా ఉంటుంది. దశరథుడు కారణం తెలియనట్టు ఆమెని బతిమాలుతూ ఇలా అంటాడు -  "కైకేయీ ఎందుకీ విచారం చెప్పు? నువ్వేం కోరితే అది చేస్తాను. ఎవరినైనా చంపించాలని ఉందా, చెప్పు? అతడెంత నిర్దోషి అయినా నీ సంతోషం కోసం చంపేస్తాను. ఎవర్నైనా రక్షించాలని ఉందా , చెప్పు? అతడెంత దోషి అయినా శిక్ష రద్దు చేస్తాను. ఈ విధంగా సాగుతుంది దశరథ మహారాజు గారి ప్రేలాపన. ఏ రాజైనా తను తల్చుకున్నది యధేచ్చగా న్యాయాన్యాయాలతో సంబంధం లేకుండా చేసెయ్యగలడన్నమాట. రాజు ప్రాపకం గానీ రాణుల ప్రాపకం గానీ సంపాదించుకుంటే ఎటువంటి కార్యాలైనా సాధించుకోగలరన్నమాట. వారి ఆగ్రహానికి గురైన వారు, అతీగతీ లేకుండా సర్వ నాశనం అయిపోతారన్నమాట. అందుచేత ఒక వ్యక్తి చేసే నిరంకుశ పాలన లో ప్రజలకు న్యాయం జరగడం కల్ల. దశరథుడు న్యాయం చేసినా అంతే; రాముడు రాజ్యం  చేసినా అంతే; పుల్లయ్య  రాజ్యం చేసినా అంతే!

"రాజులకు అన్యాయాలు చేసే అవకాశం ఉండేది" అని చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే పైన పేరాలో ఎక్కడ కూడా దశరథ మహారాజు అన్యాయాలు చేసినట్టు చెప్పలేదు. చెయ్యగలనని చెప్పాడు. ఒకమనిషి ఒక పని చెయ్యడం వేరు చేస్తానని చెప్పడం వేరు. అప్పటికాలం లోని తర్కజ్ఞానం గురించి అవాకులు, చెవాకులు పేలిన రంగనాయకమ్మ ఈ మాత్రం తార్కిక దృష్టితో ఆలోచించలేకపోవడం కడు విషాదం. ఒక భర్త తన భార్య అలక తీర్చడానికి చెప్పిన మాటలను బట్టి ఆయన అలా చేశాడనే కంక్లూజన్ కు రావడం ఏ తర్క జ్ఞాన పుస్తకం లో ఉందో నాకైతే తెలియదు. ఇక మరోసారి జెనరలైజేషన్; దశరథ మహారాజు అలా చేయగలనని చెప్పాడు, దాన్నుంచీ రాజులందరూ అన్యాయాలు మాత్రమే చేస్తారని చెప్పడం.. ఎలాగైనా రాజులను తప్పు పట్టాలన్న దుర్బుద్ది తప్ప మరొకటి కాదు.  వ్యక్తిపాలనలో న్యాయం జరగదు అని చెబుతున్న రంగనాయకమ్మ నియంతృత్వ పోకడలకు మారుపేరైన కమ్యూనిజాన్ని సమర్ధించడం గురివింద నైజం. 

గంగ ఒడ్డు దిగాక సుమంత్రుడితో రాముడు: భరతుడిని, నా తండ్రినీ సేవించుకుంటూ ఉండు! రాజులు అపజయాలు, దు:ఖాలు భరించలేరు. తమ మనసులోని కోర్కెలు నిర్విఘ్నంగా తీర్చుకోవాలని రాజులు కలలు కంటారు. భరతుడికి సేవలు చేస్తూ ఉండమని నా తల్లితో చెప్పు. చిన్నవాడనే నిర్లక్ష్యం కూడదు. రాజుని పూజించడానికి వయసుతో నిమిత్తం లేదు. సిరిసంపదల వల్లనే రాజు అందరికన్నా అధికుడు, పూజ్యుడూ అవుతాడు.
చిత్రకూటంలో లక్ష్మణుడితో రాముడు: నేనసలు రాజ్యం ఎందుకు చేయాలనుకుంటున్నానో తెలుసా? నా తమ్ములందరూ సిరి సంపదలతో, రాజ భోగాలతో, సర్వ సౌఖ్యాలతో ఎల్లకాలం తుల తూగాలని" . 
ఈ రకంగా రాముడు తన కోర్కెలు తీర్చుకోవడానికి, తన బంధు మిత్రుల్ని సుఖపెట్టడానికీ, తనకు విధేయంగా లేని ప్రజల అంతు తేల్చడానికి రాజ్యం చేయాలనుకున్నాడన్నమాట. ఇలా పరిపాలించే రాముడి రాజ్యమేనా ప్రజలు కలలుగనే "రామరాజ్యం"?
  
రంగనాయకమ్మ హైందవ మతం మీద దాడి చేయడానికి ఎంత నికృష్టమైన లాజిక్కులు చెప్పిందో ఈ పేరా చూస్తే తెలుస్తుంది. ఈ మొత్తం పేరాలో రాముడు తనకోర్కెలు ఎక్కడ తీర్చుకున్నాడో ఎవరైనా చెబుతారా?? తన తమ్ములు సుఖంగా ఉండాలని కోరుకోవడం కూడా తప్పేనా? మనం ప్రేమించే ప్రతీ వ్యక్తీ సుఖంగా ఉండాలనే ఆకాంక్షిస్తాం. అందులో కూడా స్వార్థమనే కోణాన్ని చూడటం కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యం కాబోలు. తనకు విధేయంగా లేని ప్రజల అంతు చూడటానికి రాజ్యం చేయాలనుకున్నాడని రంగనాయకమ్మ ఆరోపించింది. పైన పేరాలో ప్రజల ప్రస్తావన ఎక్కడ వచ్చిందో కొంచెం చెబుతారా?? ఆవు వ్యాసం టైపులో ప్రతీ పేజీలో కనీసం రెండు సార్లు రాముడు ఇలా తప్పు చేశాడు, ప్రజలు కష్టాలు పడ్డారు అని అరిగిపొయిన రికార్డ్ తప్ప మరొకటి కాదు. రాముడు ప్రస్తుతకాలానికి చెందనివాడు కాబట్టి ఏమైనా ఆరోపించచ్చు. ఎవరైనా ఎదురు చెబితే వాళ్ళను "చాంధసులు" అని ముద్రవేసి హేళన చేయవచ్చు. మాటిమాటికీ ప్రజలు ప్రజలు అని ముసలి కన్నీరు కారుస్తూ ఎంచక్కా పుస్తకాలు అమ్ముకోవచ్చు. రంగనాయకమ్మ తన స్వార్థం కోసం, కేవలం తన స్వార్థం కోసం ఒక మతం గురించి ఎంతటి విషప్రచారం సాగించిందో చూడండి. మొత్తంగా చూస్తే రంగనాయకమ్మ మార్కెటింగ్ స్ట్రాటెజీ నుంచీ ప్రతీ ఒక్క మార్కెటింగ్ మేనేజర్ నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. 

సర్వేజనా సుఖినోభవంతు,
-రామదండు 



Sunday 3 June 2012

పీఠిక లోనే మొదలైన పీడ: రామదూషణ

పీఠిక లో రామదూషణ చాలానే  జరిగింది. దూషణ అని ఎందుకన్నానంటే ఇది విమర్శ  స్థాయి దాటి చాలా దూరం వెళ్ళింది. ఉదాహరణకు క్రింది వాక్యాలు చదవండి:
రాముడికి నిజంగా ఉన్న లక్షణాలు:
౧.లోకాన్ని మోసపుచ్చే అబద్దపు వ్రతాలు
౨.ఎప్పుడూ ఎదుటివాడికి నీతులు బోధిస్తూ ఉండటం
౩.కపట గాంభిర్యం
౪. రెండు నాలికల మాటలు
౫.తనే జ్ఞానిననే అజ్ఞానం
౬.తనకు సేవలు చేసే ఆప్తులని శంకించి అవమానించడం
౭.నిస్సహాయులని ఘోరాతి ఘోరంగా హింసిచడం


ఈ లక్షణాలన్నీ రాముడిలో ఉన్నాయని రంగనాయకమ్మ రాసింది. అందుకు ఆమె ఇచ్చిన కారణాలు విషవృక్షం లోపలి పేజీలలో ఉందని ఆశిద్దాం (అవి ఎంతమాత్రం లాజికల్ అనేది తరువాత సమస్య). కనుక ఈ పుస్తకం లోపలిపేజీలలోకి వెళ్ళేముందు ఈ లక్షణాలకు సంబంధించిన జస్టిఫికేషన్ కోసం చూడాలి. సరే, ఆ విషయం పక్కన పెడితే  ఈ లక్షణాలన్ని రాముడికి నిజంగా ఉన్నాయని అనడం కంటే  తనకు రాముడిలో కనిపించిన విషయాలు అని రంగనాయకమ్మ  రాసుంటే బాగుండేది. ప్రతీచోటా ఇలాంటి జెనరలైజ్ చేస్తూ రాయడం రంగనాయకమ్మ శైలి అనుకుంటా..

ఇప్పుడు ఇంకొక విషయానికి వద్దాం:
అసలు పితృవాక్య పరిపాలన అనేది  ఒక బూటకపు ధర్మం. ఆ  ధర్మం పాటించడానికి నానా కష్టాలు పడాలంటే ఏ కొడుక్కి ఆత్మలోంచి నిజమైన సంతోషం రాదు. కానీ సమాజం లో అదే గొప్ప కీర్తి గా చెలామణి అవుతుంది కాబట్టి , దాన్ని సంతోషంగా పాటిస్తున్నట్టు పైకి నటన ! ఆత్మ వంచన! పరవంచన!కీర్తి కాంక్ష!గొప్ప ఆదర్శాన్ని పాటిస్తున్నామనే భ్రమ. కీర్తి కోసం వీపుమీద ఒక పర్వతం ఎత్తుకుంటే తిన్నగా నడవడం సాధ్యమేనా? - కాదు. అది ఎలా సాధ్యం కాదో బూటకపు సంఘనీతులు, గందరగోళపు ధర్మాలు పాటించవలసివస్తే ఏ వ్యక్తీ వీటికోసం స్వచ్చంగా, నిష్కల్మషంగా నిర్విచారంగా ప్రవర్తించడం సాధ్యం కాదు.

పితృవాక్య పరిపాలన అనేది రంగనాయకమ్మకు బూటకపు ధర్మమట.. ఎందుకు?? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే రామయణ కావ్యం  లో పితృవాక్య పరిపాలన అనేది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని బూటకం అనడం ద్వారా రంగనాయకమ్మ రాముడు చేసిన మిగతా పనులను చులకన చేయడానికి ఒక చక్కని ప్లాట్ ఫారం ఏర్పాటు చేసుకుంది. బూటకం అని రాసింది కానీ ఎందుకు బూటకం అనేది చెప్పలేదు.. ఆత్మలోంచి నిజమైన సంతోషం రాదు. అని రాయడం నన్ను ఆశ్చర్య పరచింది. భౌతిక వాదినని చెప్పుకునే రంగనాయకమ్మ ఇలా ఆత్మలూ, దయ్యాలు అని మాట్లాడటం ఏమిటో??
పై వాక్యాన్ని మరో కోణం లో  ఆలోచిస్తే రాముడు చేసిన ఏ పనినైనా తిట్టాలనే తపన కనిపిస్తుంది. ఎందుకంటే మహిళ అయినరంగనాయకమ్మకు తల్లిదండ్రులకు ఏం చేస్తే కొడుకులు సంతోషపడతారో తెలిసే అవకాశమే లేదు. ఇక్కడ సమస్య రంగనాయకమ్మ మహిళ కావడం కాదు. ఆమెకు కుటుంబ విలువల పట్ల గౌరవం లేకపోవడం. ఇక రాముడు ఆత్మవంచన చేసుకున్నాడని నిందించడం. రాముడు ఆత్మవంచన చేసుకున్న విషయం ఈవిడ గారికి ఎలా తెలిసిందో ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు. ఇక గొప్ప ఆదర్శాలను పాటిస్తున్నామనే భ్రమ  అని రాసింది. ప్రతీ మనిషి తన ఆదర్శాలను గొప్పవనే నమ్ముతాడు లేకపోతే అ ఆదర్శాలు పాటించలేడు. మరి రాముడి ఆదర్శాల గురించి  ఇన్ని మాటలు మాట్లాడుతున్న రంగనాయకమ్మ కొన్ని  లక్షల మందిని పొట్టన పెట్టుకున్న మార్క్సిస్ట్ సిద్దాంతాలను మాత్రం గొప్పవని ఎలా చెబుతుంది?? ఇది ఆత్మ వంచన అవునో కాదో చెప్పలేను కానీ ఖచ్చితంగా పర వంచనే.. 

ఇక మరొక జోకు వీపు మీద పర్వతం. ఒక నియమం ఒక మనిషికి బరువుగా అనిపించవచ్చు. కానీ అది అందరికీ బరువు కావాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఉదయం ఆరు గంటలకు నిద్ర లేవడం అనేది మన సమాజం లో చాలామందికి బరువైన పని లా అనిపిస్తుంది కానీ కొందరికి చాలా సౌకర్యవంతంగా , ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఆ కాలం లో రాముడికి పితృవాక్య పరిపాలన అనేది కష్టం కాక పోయి ఉండవచ్చు. ఇక మరొక విషయం, రాముడు తన తండ్రికి ముద్దుల బిడ్డ అలాంటి రాముడికి బలంతంగా ఒక నియమాన్ని పాటించాల్సిన పని లేదు. రాముడిని ఆ నియమం పాటించమని ఎవరూ బలవంత పెట్టలేదు, కాబట్టి అదేదో ఆత్మవంచన అనుకోవడం రంగనాయకమ్మ  బుద్దిహీనతను సూచిస్తుంది తప్ప మరొకటి కాదు. కుటుంబ విలువల పట్ల గౌరవం లేని రంగనాయకమ్మకు పితృవాక్య పరిపాలన ఒక భారం లాగా అనిపించవచ్చు. కానీ అది ఇతరులకు అనిపించాల్సిన అవసరం లేదు. ఇలాంటి జెనరలైజేషన్లు ఈ పుస్తకం నిండా ఉన్నట్టుగా ఉన్నాయి.

ఇదే పీఠికలో మరొక చోట రంగనాయకమ్మ ఇలా రాసింది:
రాముడికి భరతుడి హక్కు సంగతి తెలియక పోవడం వల్లనే పట్టాభిషేకానికి సిద్దపడితే అది రాముడి తప్పు అవదు. కానీ, ఆ  విషయం తెలిసీ రాముడు పట్టాభిషేకానికి సిద్దపడ్డాడంటే అది రాముడి కపటం అవదూ?? 
ఒకసారి అడవిలో పులి జింకను తినడానికి వచ్చిందట. జింక " నేను నీకేమీ అపకారం చెయ్యలేదు. నన్నెందుకు తింటావ్?" అని అడిగింది. దానికి పులి " నదిలో నీళ్ళు తాగి నీళ్ళు ఎంగిలి చేశావ్ అని చెప్పిందట"
ఇలా ఉంది రంగనాయకమ్మ వైఖరి. ముందు రాముడు భరతుడి గురించి తెలిసి కూడా రాజ్యం అడగటం తప్పు అని చెప్పింది. పితృవాక్య పరిపాలన అనేది రాముడి నియమం అంటే, అది బూటకం అంటుంది. స్థూలంగా రాముడు ఏం చేసినా తప్పే(రంగనాయకమ్మ దృష్టిలో) దాన్ని ఏదో విధంగా జస్టిఫై చేసుకోవడానికి ఈ సర్కస్ వేషాలు.. ఈ ధోరణి కేవలం రాముడిపై ఆమెకున్న ద్వేషాన్ని ఎత్తి చూపుతుంది తప్ప మరొకటి కాదు.

తర్వాత పేరా:
కవి రాసే నీతులు అనేకం పరస్పర విరుద్దంగా ఉండటానికి కారణం ఆ నీతులను నిర్దేశించే సమాజం లో హేతువాదానికి, తర్క జ్ఞానికి స్థానం లేకపోవడమే.. సమాజం లో లేని తర్క జ్ఞానాన్ని కవి తన రచనలలో చూపించలేడు.ప్రకృతి విరుద్దమైన కల్పనలతో, కపటత్వాలతో , మర్మ గుణాలతో ఆత్మ వంచన చేసుకునే సమాజం లో కవీ వంచకుడే..

అప్పటి తర్కజ్ఞానం గురించి మాట్లాడుతున్న రంగనాయకమ్మ తర్క జ్ఞానమెంతనో త్వరలోచూద్దాం.Depression/violence తో నిండిపొయిన ప్రస్తుత సమాజం లో రంగనాయకమ్మ  ఏమౌతుంది?? డిప్రెషన్ పేషెంట్ ? లేక బ్లడ్ మాంగర్?? ఎవరి చాయిస్ వాళ్ళది. ఆఖరికి రామాయణాన్ని గ్రంథస్తం చేసిన వాల్మీకి మహర్షిని దూషించడానికి రంగనాయకమ్మ ఏ మాత్రం వెనకాడలేదు. ఆమెలోని ద్వేషాన్ని తెలియజేసేందుకు ఇంతకంటే పెద్ద సూచిక అవసరం లేదు. 


స్థూలంగా చూస్తే పీఠిక లోని ఈ సెక్షన్ లో కొన్ని విషయాలు స్పష్టం అవుతాయి:
౧. రాముడిని దూషించడం లో రంగనాయకమ్మ  చాలా ఆరితేరిన మనిషి. బహుశా అందులో ఆనందాన్ని పొందుతుంది కాబోలు.
౨. ప్రతీ విషయాన్నీ తనే ప్రధమం అనే కోణం లో ఆలోచించడం రంగనాయకమ్మ నైజం. దీన్నే ఇంగ్లీష్ లో Ego Centric Attitude అంటారు. 

సర్వేజనా సుఖినోభవంతు
-రామదండు